
న్యూస్ డెస్క్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన “కోటి గళాల ఆందోళన” ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసనలో భాగంగా, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
బుధవారం అంబటి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు చెప్పినా ఆయన వినకుండా, వారితో వాగ్వాదానికి దిగారు.
కంకరగుంట వంతెన వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను అంబటి, ఆయన అనుచరులు బలవంతంగా నెట్టివేసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో పోలీసులను నెట్టేశారని, వారి విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలు మోపారు.
అయితే, ఈ కేసులను అంబటి రాంబాబు తేలిగ్గా తీసుకుంటున్నారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకుందని ఆయన వర్గం అంటోంది. కూటమి ప్రభుత్వంపై అంబటి రాజీలేని పోరాటం చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు ఆయనను ప్రశంసిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబటిపై ఇది నాల్గవ కేసు. గతంలో జగన్ పర్యటన, వెన్నుపోటు దినం వంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి.
