
న్యూస్ డెస్క్: జమ్మూకశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి గురువారం యాత్రను నిలిపివేయాలని అధికారులు ప్రకటించారు.
ఇటీవలి రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు ట్రాక్లను దెబ్బతీశాయి. దీంతో అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి వచ్చిందని సమాచార శాఖ స్పష్టం చేసింది. ఈ కారణంగా భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకుని యాత్రను నిలిపివేసినట్టు చెప్పారు.
డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి కూడా ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్రను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.
జూలై 3న ప్రారంభమైన ఈ తీర్థయాత్రలో ఇప్పటి వరకు 2.35 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని దర్శించారు. ఇంకా 4 లక్షల మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు.
మొత్తం 38 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్టు 9న ముగియనుంది. అధికారులు వర్షాలు తగ్గిన వెంటనే మార్గాలను శుద్ధి చేసి యాత్ర తిరిగి ప్రారంభించనున్నారు.
