
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక ఏది నిజమో, ఏది గ్రాఫిక్స్ అర్థం కావడం లేదు. సినిమా వాళ్లను రాజకీయాల్లోకి లాగడం కామన్ అయినా, ఇప్పుడు టెక్నాలజీతో ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా స్టార్స్ ను వాడేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. మెదక్ జిల్లాలో ఒక అభ్యర్థి తన ‘కత్తెర’ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ, ఏకంగా అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నట్లు ఒక ఫోటోను క్రియేట్ చేసి వదిలారు. బన్నీ స్వయంగా వచ్చి ప్రచారం చేస్తున్నట్లు ఆ ఫోటోలో ఉండటం చూసి జనాలు అవాక్కయ్యారు.
లోకల్ ఎలక్షన్స్ కు పాన్ ఇండియా స్టార్ రావడం ఏంటని ఆరా తీస్తే, ఇదంతా ఏఐ మాయాజాలం అని తేలింది. ఓటర్లను ఆకర్షించడానికి సదరు అభ్యర్థి బన్నీ క్రేజ్ ను ఇలా వాడుకున్నాడు. ఈ క్రియేటివిటీ చూసి ‘ఎవర్రా మీరంతా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో ఇలా టెక్నాలజీని వాడటం చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ అయితే ఈ ఫోటోను చూసి నవ్వుకుంటున్నారు. మా హీరో రేంజ్ ను గల్లీ ఎలక్షన్స్ వరకు తెచ్చేశారా అని సరదాగా ఫీలవుతున్నారు.
మొత్తానికి ఎన్నికల ప్రచారంలో ఏఐ వాడకం కొత్త పుంతలు తొక్కుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు ఎంతకైనా తెగిస్తారని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
