
న్యూస్ డెస్క్: తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఒక స్టేడియంలో జరిగిన బహిరంగ మరణశిక్ష వైనం ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఏకంగా 80 వేల మంది ప్రత్యక్షంగా చూస్తుండగా, కేవలం 13 ఏళ్ల బాలుడు చేత హంతకుడిని అత్యంత కిరాతకంగా చంపించారు.
తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఖోస్ట్కు చెందిన మంగళ్ అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 13 మందిని (9 మంది చిన్నారులు 4 గురు మహిళలు) హత్య చేశాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు అతడికి మరణశిక్ష విధించింది.
బాధిత కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి నిందితుడైన మంగళ్పై మరణశిక్షను అమలుపరిచాడు. ఈ మరణశిక్షను కోర్టు ప్రతీకార శిక్షగా అభివర్ణించింది.
ఈ మరణశిక్షపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికారులు మాత్రం తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అమానవీయం అంటూ కామెంట్లు చేశారు. అయితే కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టు స్పష్టం చేసింది.
బాధితుల కుటుంబాలకు క్షమాభిక్ష శాంతి ప్రతిపాదనలు చేసినా వారు అంగీకరించకపోవడం వల్లే మరణశిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన చూడడానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.
తాలిబన్ల పాలనలో బహిరంగ మరణశిక్షలు అత్యంత సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. 2021లో తాలిబన్లు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఇది 12వ బహిరంగ మరణశిక్ష కావడం గమనార్హం.
