
న్యూస్ డెస్క్: దీపావళికి అనుమతించిన గ్రీన్ క్రాకర్స్ సాధారణ వాటి కంటే మెరుగైనప్పటికీ, అవి పూర్తిగా కాలుష్య రహితమైనవి కావు. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ క్రాకర్స్ వెలిగించినప్పుడు అల్ట్రా-ఫైన్ పార్టికల్స్ను విడుదల చేస్తాయి. ఈ సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి, ముఖ్యంగా ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారికి ప్రమాదం కలిగిస్తాయి.
దీపావళి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో, బాణసంచా వల్ల ఉత్పన్నమయ్యే పొగ, దుమ్ము కిందికి కూరుకుపోయి కాలుష్యాన్ని మరింత పెంచుతుంది. అందుకే, పర్యావరణవేత్తలు క్రాకర్స్ కాల్చడం తగ్గించి, దీపాలు వెలిగించే పారంపరాగత పద్ధతుల ద్వారా సంబరాలు జరుపుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
ఆస్తమా లేదా హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, మరియు చిన్న పిల్లలు బాణసంచాకు దూరంగా ఉండాలని నిపుణులు గట్టిగా సూచించారు. “కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటే, దీపావళిని వెలుగుల పండుగగా మాత్రమే జరుపుకోవడం మనందరి సామాజిక బాధ్యత” అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గ్రీన్ క్రాకర్స్ ను నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) మరియు CSIR సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిలో సాధారణ బాణసంచా కంటే ప్రమాదకర రసాయనాలు తక్కువగా వాడతారు. వీటిలో పొగ, శబ్దం, కాలుష్య ఉద్గారాలు దాదాపు 30% వరకు తక్కువగా ఉత్పత్తి అవుతాయి.
పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్కు మాత్రమే అనుమతి ఇచ్చింది. ధృవీకరించబడిన గ్రీన్ క్రాకర్స్ను మాత్రమే కాల్చడానికి అనుమతి ఉంది. నకిలీ ఉత్పత్తులను నివారించడానికి ప్రతి గ్రీన్ క్రాకర్పైనా క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
