
న్యూస్ డెస్క్: తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన పాలనలో పొరుగు రాష్ట్రాలతో చీకటి ఒప్పందాలు చేసి, తెలంగాణకు నష్టం కలిగించారని ఆరోపించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల వివాదంపై స్పందించిన ఉత్తమ్, చుక్కనీటినీ వదులుకోమని తేల్చిచెప్పారు. ‘‘మాదగ్గర రైతులు లేరా? మా పంటలు పండకూడదా?’’ అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, లేనిపోని విజన్లు మాకు అవసరం లేదన్నారు.
కేసీఆర్ మాదిరి లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేసే ప్రయత్నం తాము చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన వాటా కోసం బలమైన వాదనలు వినిపిస్తామన్నారు.
ఈ సందర్భంగా మూడు రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక తమ ఆయకట్టు పెరిగిందని, కొత్త లెక్కల ప్రకారం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతోందని తెలిపారు.
మాజీ సీఎం హయాంలో జరిగిన ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలకు మేలు చేయలేదని ఉత్తమ్ మరోసారి ఆరోపించారు. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగనివ్వబోమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజల హక్కులు, నీటి అవసరాలు కాపాడడమే తమ ప్రాధాన్యం అని మంత్రి చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం కఠినంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
