
న్యూస్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ఉల్లేఖిస్తూ, మహిళా శక్తి ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ సైనిక చర్యలో భారత నారీశక్తి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
భోపాల్లో జరిగిన మహిళా స్వశక్తికరణ మహా సమ్మేళన్లో ప్రధాని పాల్గొన్నారు. “ఉగ్రవాదుల దాడికి భారత మహిళలే సమాధానం ఇచ్చారు. వారిని కాపాడే శక్తులు కూడా మౌలికంగా తలెత్తలేని స్థితిలోకి వచ్చాయి” అని మోదీ చెప్పారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని బీఎస్ఎఫ్ మహిళా బృందం అఖ్నూర్లో మూడు రోజుల పాటు వీరోచితంగా పోరాడిందని వివరించారు.
“సిందూర్ అంటే భారతీయ సంప్రదాయంలో నారీశక్తికి ప్రతీక. పహల్గామ్లో దాడి మన సంస్కృతి మీదే దాడిగా భావించాం. దానికి సమర్థంగా బదులిచ్చాం” అని ప్రధాని వివరించారు.
ఈ ఆపరేషన్ దేశ భద్రతా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని, భారత సైన్యం, మహిళా అధికారుల ధైర్యం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
